black fungus: ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పురుషులకే ఎక్కువ

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో ప్రస్తుతం మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు పురుషులకు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు

Updated : 22 May 2021 12:19 IST

పరిశోధనలో వెల్లడి

ముంబయి: కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో ప్రస్తుతం మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు పురుషులకు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోల్‌కతాలోని జీడీ హస్పిటల్‌ అండ్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్‌ అవదేశ్‌ కుమార్‌సింగ్‌, డాక్టర్‌ రితుసింగ్‌, ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ శశాంక్‌ జోషి, దిల్లీలోని నేషనల్‌ డయాబెటిస్‌, ఒబేసిటీ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ అనూప్‌ మిశ్రా సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు. అరుదుగా వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదకరమైందని వారు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల ఆధారంగా పరిశీలిస్తే వారిలో 79శాతం మంది పురుషులే ఉన్నట్లు వారు తెలిపారు. ఇది సోకిన వందమందిలో 83 మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులేనని తేలిందన్నారు. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్‌ పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచించారు. కరోనా పూర్తిగా తగ్గక ముందే శరీరం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుండగా, కొవిడ్‌ తగ్గాకనే వ్యాధి బయటపడుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధనలో భారత్‌తో సహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ రోగులను పరిశీలించామని పేర్కొన్నారు.

మ్యుకర్‌ మైకోసిస్‌ సాధారణంగా ముక్కు, సైనస్‌, నాడీవ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులు, చర్మం, దవడ ఎముకలు, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు. కరోనా శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌ను ముక్కు, సైనస్‌ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు. తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉండి తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువ ఉన్నవారిలో ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్టికో స్టెరాయిడ్స్‌ వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ శశాంక్‌ జోషి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని