Anil Deshmukh: అనిల్‌ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది......

Published : 06 Nov 2021 23:41 IST

ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దేశ్​ముఖ్​ను విచారించేందుకు మరో 9 రోజులు రిమాండ్​ కావాలని ఈడీ అధికారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్​ముఖ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్​ముఖ్​తో పాటు కుందన్​ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. మనీలాండరింగ్‌పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమనీ ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని