Mumbai: నవంబర్‌ 1 నుంచి ముంబయిలో నిషేధాజ్ఞలు.. కారణమిదే..!

ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడంతో పాటు చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం వంటి కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కారణమిదే..

Published : 22 Oct 2022 01:38 IST

ముంబయి: ముంబయి(Mumbai) నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్‌ 1 నుంచి 15 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటంతో పాటు చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం వంటి కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ముంబయి నగరంలో శాంతిభద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఈ నిషేధాజ్ఞలు ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. 

మహారాష్ట్ర పోలీసు చట్టంలోని నిబంధనల ప్రకారం జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో వివాహాలు, అంత్యక్రియలు, క్లబ్బులు, కంపెనీలు, సహకార సంఘాలు, థియేటర్లు, సినిమాహాళ్లలో సమావేశాలకు మాత్రం మినహాయింపు కల్పించారు. అలాగే, ముంబయిలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత పరిరక్షించడంలో భాగంగా నవంబర్‌ 3 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఆయుధాల ప్రదర్శన, మందుగుండు సామగ్రి వినియోగంపైనా నిషేధం విధిస్తూ మరో ఉత్తర్వును విడిగా జారీ చేశారు. సామాజిక నైతికత, భద్రత లేదా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదానికి దారితీసే ఫొటోలు, సింబల్స్‌, బోర్డులను రూపొందించడం, ప్రదర్శించడంపైనా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, సంగీతం వంటి వాటిపైనా నిషేధాజ్ఞలు అమలులలో ఉంటాయని స్పష్టంచేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని