చిన్నారులకు నాజల్‌ వ్యాక్సిన్‌ ఉత్తమం

చిన్నారులకు ఇచ్చేందుకు నాజల్‌ వ్యాక్సిన్‌ ఉత్తమమని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. బుధవారం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) 16వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

Updated : 21 Jan 2021 06:07 IST

వెల్లడించిన ఎయిమ్స్‌ డైరక్టర్‌

దిల్లీ: చిన్నారులకు ఇచ్చేందుకు నాజల్‌ వ్యాక్సిన్‌ ఉత్తమమని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. బుధవారం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) 16వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సంభాషించి వారి సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నాజల్‌ వ్యాక్సిన్‌ (ముక్కు ద్వారా ఇచ్చే టీకా) సరైనదని ఆయన అన్నారు. ‘‘కరోనా లక్షణాలు చిన్నారుల్లో చాలా తక్కువగా ఉంటాయి. కానీ వారి నుంచి వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశముంది. కాబట్టి ఈ నాజల్‌ వ్యాక్సిన్ అయితే ఒక అరగంటలో ఒక తరగతి మొత్తానికి వ్యాక్సిన్‌ వేయగలం. ఇది చాలా అవసరం కూడా. అంతే కాకుండా ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌లను చిన్నారులపై ప్రయోగాలు చేయలేదు. కాబట్టి వాటిని వారికి అందించలేం. చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు తర్వాత జరిగే అవకాశముంది. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ ఈ నాజల్‌ వ్యాక్సిన్‌ అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదొక మంచి పరిణామం. ఇది స్ప్రే లాగ పనిచేస్తుంది కాబట్టి అంత ఇబ్బంది కూడా ఎదురవదు.’’ అని గులేరియా అన్నారు.

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్నవారు టీకా తీసుకోవచ్చా అని ఎన్డీఆర్‌ఎఫ్‌ సభ్యుడు ప్రశ్నించారు. ‘‘ కరోనా తగ్గిన 4-6 వారాల తర్వాత వారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. అందరితోపాటు కరోనా వైరస్‌ వచ్చి తగ్గినవారు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే కరోనాతో పోరాడే క్రమంలో మన శరీరంలో ఎంత రోగనిరోధకశక్తి ఉందో తెలియదు కాబట్టి. రోగనిరోధకశక్తి తగినంత ఉన్నా యాంటీబాడీలు తయారు చేయడంలో వ్యాక్సిన్‌ మరింత సహకరిస్తుంది.’’ అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా ‘అంటువ్యాధులు, వాటిని అరికట్టడంలో ఎదురయ్యే సవాళ్లు’ అనే అంశంపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. రానున్న రోజుల్లో బయో టెర్రరిజం ముప్పుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ వంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఇటువంటి వైరస్‌లు చాలా త్వరగా వ్యాపిస్తాయన్నారు. కరోనా నేర్పించిన గుణపాఠాలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరిశోధనలు పెరగాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రపంచారోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా సాధారణ వైద్య సేవలు అందించే సిబ్బంది కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారన్నారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ ఛైర్మన్‌ ఎస్‌ ఎన్‌ ప్రధాన్‌ మాట్లాడుతూ.. గతేడాది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఓ వైపు కరోనా సంక్షోభంలో సేవలందిస్తూ మరోవైపు వరదలు, తుఫాన్లు వంటి విపత్కర సమయాల్లో సమర్థవంతంగా సేవలందించారనని తెలిపారు. 2006, జనవరి 19న ప్రకృతి, మానవ విపత్తులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించారు.

ఇవీ చదవండి..

టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి..లేదంటే..

పదోరౌండ్‌ చర్చలు: పరిష్కారం దొరుకుతుందా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని