Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో

భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. నీటి అడుగున లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేసిన  స్వదేశీ టార్పిడోను విజవంతంగా పరీక్షించింది.

Published : 06 Jun 2023 10:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత నౌకాదళం (Indian Navy) అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడో (Heavy Weight Torpedo)ను నేవీ మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని (Underwater Target) ఈ టార్పిడో విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

‘‘నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డీఆర్‌డీవో సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన హెవీ వెయిట్‌ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశాం. ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్తులో మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనం’’ అని నేవీ రాసుకొచ్చింది. అయితే ఈ టార్పిడో పేరును గానీ.. ఇతర ఫీచర్లను గానీ నౌకాదళం ఇప్పుడే బయటపెట్టలేదు. హిందూ మహా సముద్రంలో చైనా కారణంగా ముప్పు పెరుగుతున్న వేళ.. నేవీ (Indian Navy) ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా.. ఇప్పటికే భారత నౌకాదళానికి వరుణాస్త్ర (varunastra torpedo) అనే అధిక బరువు గల టార్పిడో ఉంది. ఇది స్వయం చోదిత, నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి. 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి శత్రునౌకల పైకి దీన్ని ప్రయోగిస్తారు. దీన్ని విశాఖపట్నంలోని ఎన్‌టీఎస్ఎల్ (నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ) అభివృద్ధి చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని