Periodic Table: పిరియాడిక్‌ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ

విద్యార్థులపై భారం తగ్గించేందుకు గానూ సిలబస్‌ను హేతుబద్దీకరిస్తున్న NCERT.. తాజాగా పదో తరగతి సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ (Periodic Table)ను తొలగించింది. దీనిపై నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో NCERT స్పందించింది. 

Published : 02 Jun 2023 14:30 IST

దిల్లీ: పదో తరగతి (Class 10)లో సైన్స్‌ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ (Periodic Table)ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) వివరణ ఇచ్చింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కరికులమ్‌ నుంచి దీన్ని పూర్తిగా తొలగించలేదని పేర్కొంది. 11, 12వ తరగతుల్లో ఈ సమాచారం ఉంటుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

సిలబస్‌ను హేతుబద్ధీకరణలో భాగంగా 10వ తరగతిలో మరికొన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు NCERT తెలిపింది. సైన్స్ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌-1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు వంటి పాఠాలను తీసేసింది. అయితే, భారత్‌లో సైన్స్ తప్పనిసరి పాఠ్యాంశంగా 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తారు. ఆ తర్వాత సైన్స్ గ్రూప్‌ చదివే విద్యార్థులకు మాత్రమే తొలగించిన పాఠ్యాంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో, ఎంతో ముఖ్యమైన పిరియాడిక్‌ టేబుల్‌ (Periodic Table) వంటి పాఠ్యాంశాలను పదో తరగతి సైన్స్ పుస్తకాల నుంచి తొలగించడంపై నిపుణులు, శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ 1800 మందికి పైగా నిపుణులు బహిరంగ లేఖ రాశారు. దీంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది.

ఈ క్రమంలోనే విమర్శలపై NCERT స్పందించింది. ‘‘కొవిడ్ మహమ్మారి సమయంలో విద్యార్థులు ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయారు. ఇక ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విద్యార్థులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సిలబస్‌ను దశల వారీగా హేతుబద్ధీకరించాం. ఎన్‌సీఈఆర్‌టీ ఫ్యాకల్టీ, సీబీఎస్‌ఈ ప్రాక్టీసింగ్‌ టీచర్లు, ఇతర నిపుణుల నుంచి చర్చలు జరిపిన తర్వాతే పాఠ్యాంశాలను తొలగిస్తూ వస్తున్నాం. ఒక క్లాసుకు చెందిన వేర్వేరు సబ్జెక్టుల్లో ఒకే కంటెంట్‌ ఉంటే దాన్ని తీసేస్తున్నాం. ఇక ఒక సబ్జెక్టులో కింది, పైతరగతుల్లో ఒకే విషయం ఉన్నా తొలగిస్తున్నాం. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సులువుగా దొరికి, వారు సొంతంగా నేర్చుకునే పాఠాలనూ తగ్గిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులకు అవసరం లేని పాఠ్యాంశాలను తొలగిస్తున్నాం. పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపు విషయంలోనూ ఇదే జరిగింది. దీన్ని మేం పూర్తిగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కరికులమ్‌ నుంచి తొలగించలేదు. 11, 12వ తరగతుల్లో దీనికి సంబంధించిన పాఠాలున్నాయి. 11, 12వ తరగతుల్లో సైన్స్‌ను ఎంచుకున్న విద్యార్థులు పిరియాడిక్‌ టేబుల్‌ గురించి తెలుసుకోవచ్చు’’ అని NCERT వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని