Sharad Pawar: ప్రభుత్వం మారగానే.. శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు..!

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ నాటకీయతకు తెరదించుతూ శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు

Updated : 01 Jul 2022 10:39 IST

ప్రేమ లేఖ అందిందంటూ ఎన్సీపీ అధినేత విమర్శలు

ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ నాటకీయతకు తెరదించుతూ శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు రావడం గమనార్హం. నిన్న రాత్రి తనకు ఆదాయపు విభాగం నుంచి నోటీసులు వచ్చినట్లు శరద్‌ పవార్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఆ నోటీసులను ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘నాకో ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి ఈ ప్రేమ లేఖ వచ్చింది’’ అని పవార్‌ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. అయితే ఇందులో తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని తెలిపారు. ఈ నోటీసులకు సంబంధించిన ఇతర వివరాలేవీ పవార్‌ వెల్లడించలేదు.

అయితే, ఈ నోటీసులపై ఎన్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే.. మా పార్టీ అధ్యక్షుడికి ఐటీ నోటీసులు వచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా దీని వెనుక ఇంకేమైనా ఉందా?’’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు కూడా ఇటీవల ఈడీ నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. ఓ వైపు మహారాష్ట్రలో సంక్షోభ పరిస్థితులు కొనసాగుతుండగానే.. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు సమన్లు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ విచారణ నిమిత్తం రౌత్‌ నేడు ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని