parliament New building: పార్లమెంట్‌ భవనం ప్రారంభం.. అక్కడి పరిస్థితులను చూసి బాధపడ్డా: శరద్‌పవార్‌

పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం ( Parliament New Building) చూసిన తర్వాత అక్కడికి వెళ్లకపోవడమే మంచిదనిపించిందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ (sharad Pawar) అన్నారు. 

Published : 28 May 2023 17:34 IST

పుణె: పార్లమెంట్‌ నూతన భవనం (Parliament New Building) ప్రారంభోత్సవాన్ని మాధ్యమాల ద్వారా చూసిన తర్వాత చాలా బాధ కలిగిందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. దేశానికి తలమానికమైన నిర్మాణం.. కేవలం కొద్దిమందికే పరిమితమైనట్లు కనిపించిందని తెలిపారు. ‘‘ ఇవాళ ఉదయం పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని టీవీలో చూశాను. ఆ తర్వాత అక్కడికి వెళ్లకపోవడమే మంచిదనిపించింది. అక్కడ పరిస్థితులను చూసి బాధపడ్డా. మన దేశం తిరోగమనం దిశగా పనియస్తోందా? ఈ కార్యక్రమం కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితం కావాలా?’’ అని శరద్‌పవర్‌ విమర్శించారు. భారత మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ చెప్పిన సమాజ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం జరిగిందన్నారు.

‘‘ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా సమాజాన్ని నిర్మించాలన్నది మాజీ ప్రధాని నెహ్రూ ఆలోచన. కానీ ఇవాళ రాజధానిలో కార్యక్రమం దానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం ప్రభుత్వ బాధ్యత. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హాజరయ్యారు. కానీ, రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో ఉపరాష్ట్రపతి ధన్‌కఢ్‌ అక్కడ లేరు. అందుకే ఈ కార్యక్రమం కేవలం కొందరు వ్యక్తుల కోసమే జరిగినట్లుగా కనిపిస్తోంది.’’ అని శరద్‌పవార్‌ విమర్శించారు.

ప్రజలకు, పాత పార్లమెంట్‌ భవనానికి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పిన శరద్‌పవార్‌.. నూతన పార్లమెంట్ అంశంపై ప్రతిపక్షాలతో ఒక్కమాట కూడా చెప్పలేదని విమర్శించారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే కూడా ఈ కార్యక్రమంపై స్పందించారు. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభం.. అసంపూర్తిగా  జరిగిందన్నారు. ‘‘ ప్రతిపక్షాలు లేకుండా పార్లమెంట్‌ భవనం ప్రారంభిస్తే అది పూర్తయినట్లు కాదు. దీనిని బట్టి దేశంలో ప్రజాస్వామ్యం లేనట్లే కనిపిస్తోంది’’ అని సుప్రియా సూలే పుణెలో వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని