కరోనా వ్యాప్తికి మీరే కారణం: దీదీ

రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు, మెడిసిన్‌ అందించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాల నుంచి జనాలను రప్పిస్తున్నారని...

Published : 18 Apr 2021 22:41 IST

భాజపాకు చురకలంటించిన పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి

కోల్‌కతా: రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు, మెడిసిన్‌ అందించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాల నుంచి జనాలను రప్పిస్తున్నారని వారి మూలంగా రాష్ట్రంలో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రంలో 2.7 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరముందని, ఈ లెక్కన 5.4కోట్ల డోసులు కావాలని దీదీ తన లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్రప్రభుత్వమే నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసేవిధంగా అనుమతులివ్వాలని కోరుతూ గత ఫిబ్రవరి 24న కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని మమతా బెనర్జీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన లేఖపై ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ‘‘ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తీవ్రస్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అందువల్ల ప్రస్తుత విపత్కర పరిస్థితులను తట్టుకునేలా సన్నద్ధమవ్వడం చాలా అవసరం. దీనికి తగ్గట్టు రాష్ట్రానికి వ్యాక్సిన్లు, మెడిసిన్లు సరఫరా చేయాలని కోరుతున్నాను’’ అంటూ దీదీ తన లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 1000 వెయిల్స్‌ రెమ్‌డెసివిర్‌ మాత్రమే అందుబాటులో ఉందని, మరో 6000 వెయిల్స్‌ అవసరమవుతుందని మమత తెలిపారు. పశ్చిమ్‌బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోన్లో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకున్నాయని మమతా బెనర్జీ అన్నారు. దీనిపై సెయిల్‌తో సంప్రదింపులు జరిపి ఆక్సిజన్‌ ఉత్పత్తి స్థాయిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.మరోవైపు శనివారం పశ్చిమ్‌ బెంగాల్లో 6,910 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 6,43,795 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 41,047 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని