కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించిన మంత్రికి వైరస్‌!

నేపాల్‌ పర్యాటకశాఖ మంత్రి యోగేష్‌ భట్టారాయ్‌ కరోనావైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Updated : 18 Dec 2022 15:59 IST

కాఠ్‌మాండు: నేపాల్‌ పర్యాటకశాఖ మంత్రి యోగేష్‌ భట్టారాయ్‌ కరోనావైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలో నేపాల్‌ను కరోనా వైరస్‌ లేని దేశంగా అభివర్ణించిన మంత్రే చివరకు వైరస్‌ బారినపడటం గమనార్హం. నేపాల్‌ మంత్రి వర్గంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి మంత్రి కూడా ఈయనే. ఈ సమయంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు ఎవరైనా అస్వస్థతకు గురైతే..వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని యోగేష్‌ సూచించారు. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో యోగేష్‌ భట్టారాయ్‌ ఒకరు. ఇప్పటికే ప్రధానమంత్రి సన్నిహితులు ఎనిమిది మందిలో వైరస్‌ బయటపడింది. వీరిలో ప్రధానమంత్రి వ్యక్తిగత వైద్యుడు, ఫొటోగ్రాఫర్‌, మీడియా ఎక్స్‌పర్ట్‌తోపాటు మరికొందరు సన్నిహితులకు వైరస్‌సోకింది. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా-ఫ్రీ దేశంగా ఉంటుందన్న మంత్రి‌..

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. కరోనా వైరస్‌ లేని దేశంగా నేపాల్‌ ఉంటుందని మంత్రి యోగేష్‌ భట్టారాయ్‌ ప్రకటించారు. ‘కరోనా వైరస్‌ నీడ పడకుండా నేపాల్‌ స్వేచ్ఛగా ఉందనే విషయాన్ని యావత్‌ ప్రపంచానికి తెలియజేయాలి’అని గత ఫిబ్రవరిలో నెలలో యోగేష్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయనకే వైరస్‌ సోకింది. అయితే, నేపాల్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే యోగేష్‌ ఆ విధంగా స్పందించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

ముందేరోజే భారత రాయబారితో భేటీ..

కరోనా వైరస్‌ నిర్ధారణ కావడానికి ముందురోజే యోగేష్‌ భట్టారాయ్ భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో యోగేష్‌ ముఖానికి మాస్కు లేకుండానే ఉన్నారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పెంచడంతోపాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఈ భేటీలో చర్చించామని ఇరువురూ వెల్లడించారు. తాజాగా నేపాల్‌ మంత్రికి కరోనా నిర్ధారణ కావడంతో ముందుజాగ్రత్తగా భారత రాయబారి వినయ్‌ మోహన్ కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని