
శ్రీలంకలో కరోనా స్ట్రెయిన్ అలజడి
అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించిన శాస్త్రవేత్తలు
కొలంబో: శ్రీలంకలోని కరోనా రూపాంతరం చెందుతోంది. దీనికి నిదర్శనంగా కొలంబోలోని అత్యంత వేగంగా వ్యాప్తి చెందే కరోనా స్ట్రెయిన్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏప్రిల్ 14 నూతన సంవత్సర వేడుకల తర్వాత ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో కొత్తరకం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకూ ఉన్న కరోనాతో పోలిస్తే కొత్తరకం స్ట్రెయిన్ అత్యంత శక్తివంతమైందని, గంట వ్యవధి పాటు గాల్లో ఉండగలదని శ్రీ జయవర్ధనాపుర విశ్వవిద్యాలయ ఇమ్యునాలజీ, మాలిక్యులర్ విభాగాధిపతి నీలికా మలవిగే తెలిపారు. కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో థర్డ్ వేవ్ రాబోతోందని, రెండు మూడు వారాలలో వైరస్ తీవ్ర రూపం దాల్చనుందని పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉపల్ రోహనా అందోళన వ్యక్తం చేశారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొవిడ్-19 మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అసేలా గుణవర్దెన సూచించారు. కొవిడ్-19 సోకిన వారికి వైద్యం అందించాడానికి ఆసుపత్రుల్లో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే దేశంలో ఏప్రిల్ 14 వరకూ రోజుకు 150 కేసులు నమోదు కాగా ఇప్పుడు సుమారుగా రోజుకు 600 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 99,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 638 మరణాలు సంభవించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.