Kochi: చెత్త డంపింగ్‌ యార్డ్‌లో అగ్నిప్రమాదం.. రూ.100కోట్ల జరిమానా

చెత్తకుప్పలో చెలరేగిన మంటలతో కేరళలోని కొచ్చి (Kochi) నగరంలో ఇటీవల గ్యాస్‌ఛాంబర్‌గా మారింది. ఈ ఘటనపై ఎన్‌జీటీ (NGT) సీరియస్‌ అయ్యింది.

Updated : 18 Mar 2023 16:24 IST

కొచ్చి: కేరళ (Kerala)లోని కొచ్చిలో డంపింగ్‌ యార్డ్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యానికి గానూ కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల భారీ జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే..

కొచ్చి (Kochi) శివారులోని బ్రహ్మపురం ప్రాంతంలో ఓ భారీ చెత్తకుప్ప (Dumping Yard) వద్ద మార్చి 2వ తేదీ సాయంత్రం మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించడంతో నేవీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు రోజుల పాటు శ్రమించి మార్చి 5వ తేదీ నాటికి మంటలను ఆర్పారు. 30 అగ్నిమాపక యంత్రాలు, 14 భారీ వాటర్‌ పంపులు, నాలుగు హెలికాప్టర్లతో 350 మంది సిబ్బంది, 150 మంది సహాయక సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

అయితే ఈ ప్రమాదం వల్ల వెలువడిన పొగ కొచ్చి నగరమంతా దట్టంగా కమ్మేసింది. విషపూరిత వాయువుల వ్యాప్తితో నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫలితంగా కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. మాస్క్‌లు ధరించాలని సూచించింది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారి కోసం మెడికల్‌ క్యాంప్‌లు, ఆక్సిజన్‌ పడకలను అందుబాటు ఉంచింది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ నిఘా లేదు. ఆ డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణ బాధ్యతలను బ్రహ్మపురం వేస్ట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ చూసుకుంటోంది. ఘటన నేపథ్యంలో ఆ ప్లాంట్‌ను మూసేశారు. ఈ ప్రమాదం కొచ్చి (Kochi)లో సంక్షోభ తరహా పరిస్థితులకు దారి తీసినట్లు మీడియా కథనాలు రావడంతో ఈ ఘటనపై ఎన్‌జీటీ సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్తకుప్పల వద్ద అగ్నిప్రమాదాలను నిరోధించడంలో కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు విఫలమైనందుకు రూ.100కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యావరణ పరిహారాన్ని నెల రోజుల్లోగా కేరళ చీఫ్‌ సెక్రటరీకి జమ చేయాలని ఎన్‌జీటీ (NGT) ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని