పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ!

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.

Updated : 21 Feb 2021 16:10 IST

పుణె: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ముంబయి, పుణె నగరాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువైంది. దీంతో పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు.

వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న పుణెలో గడిచిన రెండు, మూడు రోజులుగా నిత్యం ఐదువందల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజు ఏకంగా 849 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు రాత్రిపూట 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది సోమవారం రాత్రి నుంచే అమలులోకి వస్తుందని పుణె డివిజినల్‌ కమిషనర్ వెల్లడించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 28వరకు పాఠశాలలు, కాలేజీలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవల్లో పాల్గొనే వారికి మాత్రమే వినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

ఆ రెండు రాష్ట్రాల్లోనే 74శాతం..

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 14వేలు నమోదుకాగా, 90మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతమున్న క్రియాశీల కరోనా కేసుల్లో 74శాతం మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో దాదాపు 49వేల యాక్టివ్‌ కేసులు ఉండగా, కేరళలో అత్యధికంగా 58వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది.

ఐదు రాష్ట్రాల్లో పెరుగుతోన్న తీవ్రత..

కేవలం మహారాష్ట్ర, కేరళలోనే కాకుండా మరో ఐదు రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాపంగా వరుసగా నాలుగో రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగినట్లు పేర్కొన్న ఆరోగ్యశాఖ, వైరస్‌ కట్టడిపై ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా అధిక సంఖ్యలో టెస్టింగ్‌ చేయడంతో పాటు ట్రేసింగ్‌ చేపట్టాలని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని