
ఉద్యమ రైతుల్లో కరోనా లేదు!
ఎన్జీవోలు, వైద్యుల వెల్లడి
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలకు పైగా ఆందోళన బాటపట్టిన రైతాంగంపై కరోనా ప్రభావంలేదని వైద్యులు వెల్లడించారు. రోగ నిరోధక శక్తితో రైతులు సురక్షితంగానే ఉన్నారని సింఘూ సరిహద్దులో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఎన్జీవోల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘‘ఇక్కడి కొంతమంది జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో అందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించాం. నలుగురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలకు పంపాం. ఫలితాల్లో వారికి నెగిటివ్ వచ్చింది’’ అని పశ్చిమబెంగాల్కు చెందిన వైద్యుడు సాగర్ తెలిపారు. వైరస్ బారిన పడకుండా అర్హులైన రైతులు టీకా తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ‘‘ వాతావరణంలోని మార్పుల కారణంగా పలువురిలో దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. అంతకుమించి ఎటువంటి అత్యయిక పరిస్థితి ఇక్కడ లేదు’’ అని లైఫ్ కేర్ ఎన్జీవో వ్యవస్థాపకుడు అవతార్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం వంటి చర్యలు తీసుకోవడమే కాకుండా అనుమానం వచ్చిన రైతులను పరీక్షలకు పంపుతున్నామని వివరించారు. రైతుల్లో కొందరు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని యునైటెడ్ సింగ్ ఆర్గనైజెషన్ వాలంటీర్ చరణ్జీత్ సింగ్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.