Talibans: తాలిబన్ల తొలి ఫత్వా.. ఇక అక్కడ కో-ఎడ్యుకేషన్‌కు నో!

అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల రాకతో విద్యావ్యస్థతలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. శనివారం తాలిబన్ల ప్రతినిధులు, పైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల యజమానుల మధ్య మూడు గంటల పాటు సమావేశం జరిగింది.

Published : 22 Aug 2021 01:09 IST

హెరాత్‌: అఫ్గానిస్థాన్‌లో ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే తాలిబన్ల అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించారు. సమాజంలో అన్ని చెడులకూ మూలం కో-ఎడ్యుకేషన్‌ అని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రైవేటు వర్సిటీ యాజమానులు, తాలిబన్ నేతలతో 3 గంటలపాటు జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు అఫ్గాన్‌లోని ఖామా అనే న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. గతవారం అఫ్గాన్‌ను పూర్తిగా ఆక్రమించిన తర్వాత తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదేనని పేర్కొంది.

కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అఫ్గానిస్థాన్‌ ఉన్నత విద్యాధికారి తెలిపారు. మహిళా ఆచార్యులను మహిళా విద్యార్థుల బోధనకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కో-ఎడ్యుకేషన్‌ విధానానికి దీంతో తెరపడనుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు దెబ్బగా భావిస్తున్నారు. ప్రస్తుతం హెరాత్‌లోని విశ్వవిద్యాలయాల్లో 40వేల మంది విద్యార్థులు, 2వేల మంది ఆచార్యులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని