Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్‌!: మంత్రి

Bengaluru: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎలాంటి షరతులూ ఉండబోవన్నారు.

Published : 30 May 2023 19:54 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలను అమలు చేసే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ హామీలను నెరవేర్చేందుకు ఏటా దాదాపు రూ.50వేల కోట్లు ఖర్చవుతుండటంతో ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి(Ramalinga Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలుచేయడంలో ఎలాంటి షరతులూ పెట్టబోమని స్పష్టంచేశారు. బెంగళూరులో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ‘‘బస్సు ప్రయాణం మహిళలకు ఉచితం. వర్కింగ్‌ విమెనా, ఇంకెవరా తదితర అంశాలతో సంబంధంలేదు. బస్సులో ప్రయాణం చేసే మహిళలందరికీ ఉచితమే’’ అని చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 3.5కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు కదా.. అని విలేకర్లు ప్రశ్నించగా..  వారందరూ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే అందరికీ ఉచితమేనని మంత్రి సమాధానం చెప్పారు.  అన్ని ప్రభుత్వ బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారా? అని విలేకర్లు అడగ్గా.. ఈ అంశంపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రవాణాశాఖలో వ్యయాలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  ఇప్పటికే కోరారని.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సమాచారాన్నంతా సేకరించి ఇచ్చారని తెలిపారు.  కర్ణాటకలో మొత్తం నాలుగు ప్రభుత్వ రవాణా కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌,  బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌, నార్త్‌ వెస్ట్‌ కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌, కల్యాణ కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ ఉన్నాయి. ఈ నాలుగు కార్పొరేషన్ల నిర్వహణకు 2022-23లో మొత్తంగా రూ.12,750 కోట్లు ఖర్చు అయిందని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని