ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సల్లో శిక్షితులే

పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హులేనని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద నాయక్‌ అన్నారు. వారికి శస్త్రచికిత్సల్లో పూర్తి శిక్షణ పొందారని ఆయన పేర్కొన్నారు.

Updated : 24 Feb 2021 19:52 IST

కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద నాయక్‌

పనాజీ: పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హులేనని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద నాయక్‌ అన్నారు. వారు శస్త్రచికిత్సల్లో పూర్తి శిక్షణ పొందారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం వెల్లడించారు. ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు కేంద్రం అనుమతించడంపై దేశవ్యాప్తంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిరసనలు చేపట్టింది. అల్లోపతి వైద్యులకు సాయంగా ఉండేందుకే ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి అన్నారు. ఐఎంఏ అంటున్నట్టు ఇది ‘మిక్సోపతి’ కాదని ఆయన పేర్కొన్నారు. ‘‘భారతీయ ప్రాచీన వైద్యాన్ని ఆధునిక వైద్యంతో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండు వైద్య విధానాలకు వేటి ప్రాధాన్యం వాటికుంటుంది. ఆయుర్వేద వైద్యులు కూడా అల్లోపతి వైద్యులతో సమంగా విజ్ఞానాన్ని పొందారు. వారి చదువు పూర్తైన తర్వాత వారు ఒక సంవత్సరం పాటు శస్త్రచికిత్సలు చేసేందుకు శిక్షణ పొందారు.’’ అని శ్రీపాద నాయక్‌ తెలిపారు.

తాజాగా ఐఎంఏ దేశవ్యాప్తంగా రెండువారాలపాటు నిరాహార దీక్షలు చేపట్టింది. తాము అన్ని అర్హత పరీక్షలు రాస్తున్నపుడు, ఆయుర్వేద వైద్యులు పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఆధారంగా శస్త్రచికిత్సలు చేయడం సబబు కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అంతర్జాతీయ వైద్య సంఘాల సహకారం కూడా తీసుకుంటామని వారు గతంలో తెలిపారు. నెలరోజుల క్రితం ఓ ప్రమాదానికి గురైన శ్రీపాద నాయక్‌ గోవా మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందారు. బుధవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని