ఆ వ్యాఖ్యలు దేశ ఐక్యతను అడ్డుకోలేవు: షా

భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. వారి వ్యాఖ్యల్ని ప్రచారాలుగా తిప్పికొడుతూ.. అలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతను చెరపలేవని స్పష్టం చేశారు.

Published : 03 Feb 2021 21:43 IST

దిల్లీ: భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. వారి వ్యాఖ్యల్ని ప్రచారాలుగా తిప్పికొడుతూ.. అలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతను చెరపలేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

‘ఏ ప్రచారం భారతదేశ ఐక్యతను దెబ్బతీయలేదు. ఏ ప్రచారం భారత్‌ కొత్త లక్ష్యాన్ని అధిగమించడాన్ని ఆపలేదు. అదేవిధంగా భారత తలరాతను ఏ ప్రచారం నిర్ణయించలేదు. పురోగతి సాధించడానికి భారత్‌ ఐక్యంగా, కలిసికట్టుగా ఉంది’ అని పేర్కొంటూ.. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చేసిన పోస్ట్‌ను రీట్వీట్‌ చేశారు.

ఇప్పటికే అంతర్జాతీయ ప్రముఖుల స్పందనపై భారత విదేశాంగ శాఖ తనదైన శైలిలో స్పందించింది. దేశంలో జరుగుతున్న సంఘటనలపై కామెంట్‌ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఓ ప్రకటన ద్వారా బదులిచ్చింది. సాగు చట్టాల్ని పార్లమెంటు పూర్తి చర్చల తర్వాతే ఆమోదించిందని.. కొన్ని స్వార్థ ప్రయోజనాల గ్రూపులు నిరసనలపై తమ ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై హాలీవుడ్‌ ప్రముఖురాలు, గాయని రిహానా స్పందించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలపై ఓ ఇంగ్లీష్‌ మీడియా రాసిన కథనాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘మనమెందుకు ఈ ఆందోళన గురించి మాట్లాడకూడదు’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్‌ కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అనంతరం స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులు రైతుల ఆందోళనపై స్పందిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. 

ఇదీ చదవండి

ప్రముఖుల వ్యాఖ్యలు బాధ్యతా రహిత్యం: విదేశాంగ శాఖ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు