Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు

ఓ కేసులో రెండేళ్ల శిక్ష పడిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.

Published : 27 Mar 2023 19:01 IST

దిల్లీ: క్రిమినల్‌, పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీ పదవి నుంచి అనర్హతకు గురైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)తన అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల్లో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ ఆయనకు నోటీసులు పంపినట్టు సమాచారం. ఏప్రిల్‌ 22లోగా అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని డెడ్‌లైన్‌ పెట్టినట్టు పార్లమెంట్‌వర్గాలు పేర్కొంటున్నాయి.  2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయనకు దిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో బంగ్లాను కేటాయించడంతో అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ నివాస గృహంలో ఉండేందుకు అనర్హుడిగా పేర్కొంటూ లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.  అయితే, దీనిపై స్పందించిన రాహుల్‌ టీమ్‌.. తమకు ఇంకా ఎలాంటి నోటీసులూ అందలేదని పేర్కొంది.  

2004లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి రాహుల్‌ గాంధీకి దిల్లీ తుగ్లక్‌ మార్గ్‌లోని 12వ నంబరు బంగ్లాను కేటాయించారు. అయితే, ఇటీవల ఓ కేసులో సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజులు గడువు ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇలా ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవడంతో ఆయనకు వచ్చే ప్రభుత్వ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. ఈ క్రమంలోనే అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, పై కోర్టులో రాహుల్‌కు ఊరట లభిస్తే తప్ప ఏప్రిల్‌ 22లోపు తన అధికార నివాసాన్ని ఖాళీ చేయక తప్పదు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా భద్రతా సిబ్బంది సంఖ్యను తగ్గించినందున గాను 2020 జూలైలో తన అధికార బంగ్లాను ఖాళీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని