Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ‘నిర్లక్ష్యం’ అభియోగాలతో కేసు నమోదు..!

Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదంలో మరో కీలక విషయం బయటికొచ్చింది. ఈ మార్గంలో కవచ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు బడ్జెట్‌ కేటాయించినా.. ఇంతవరకూ అందుకోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని సమాచారం.

Published : 05 Jun 2023 14:17 IST

భువనేశ్వర్‌: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Tragedy)పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం’’ వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టనుంది. అయితే, ప్రస్తుతానికి ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన రైల్వే ఉద్యోగులు ఎవరనేది ఇంకా తేలలేదని, దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఒడిశాలోని బాలాసోర్‌ (Balasore train accident)లో గత శుక్రవారం రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 275 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడమే ఈ దుర్ఘటనకు కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రాథమికంగా వెల్లడించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే బోర్డు సిఫార్సు చేసింది. సీబీఐ అధికారులు సోమవారం ఘటనాస్థలానికి వెళ్లి ప్రమాద తీరును పరిశీలించనున్నారు.

151 మృతదేహాల గుర్తింపు..

ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 275 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 151 మృతదేహాలు ఎవరనేది అధికారులు గుర్తించారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపించేందుకు ఒడిశా సర్కారు ఏర్పాట్లు చేసింది.

‘కవచ్‌’ ఎందుకు లేదు..?

ప్రమాదం జరిగిన మార్గంలో యాంటీ కొలిజన్‌ వ్యవస్థ ‘కవచ్‌ (Kavach)’ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. కవచ్‌ను ఏర్పాటు చేయకపోవడంపై విపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్న వేళ.. కీలక విషయం బయటికొచ్చింది. ఈ స్వదేశీ సాంకేతికతను అనుసంధానం చేసేందుకు సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (బాలాసోర్‌ మార్గం దీని కిందకే వస్తుంది)కు రూ.468.9 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారట. అయితే గత మూడేళ్లలో ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని