Jeo Biden: వ్యాక్సిన్‌ వేయించుకుంటే 100 డాలర్లు ఇవ్వండి!

కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడమే........

Published : 30 Jul 2021 21:43 IST

రాష్ట్రాలకు అమెరికా అధ్యక్షుడు విజ్ఞప్తి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ముందుకొచ్చేలా నగదు రివార్డులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌ రేటు మరింతగా పెంచేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఉపకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. క్రొగెర్‌ గ్రోసరీ స్టోర్‌ కూడా ఇలాంటి ప్రయత్నం చేయగా ఆ సంస్థ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్‌ రేటు 50శాతం నుంచి 75శాతానికి పెరిగిందని శ్వేతసౌధం పేర్కొంది. అలాగే, న్యూ మెక్సికో, ఒహైయో, కొలరాడోలలోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాలు/ప్రాంతాలు తన కొవిడ్‌ ఉపశమన చట్టం నుంచి నిధులు ఖర్చు చేయవచ్చని బైడెన్‌ సూచించారు. 

మరోవైపు, సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా జనాభాలో దాదాపు 50శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.  అలాగే, గత వారం రోజులుగా రోజూ దాదాపు 60వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో మళ్లీ కలవరం మొదలైంది. ఈ నెల 27న కొవిడ్‌ హాట్‌స్పాట్‌లుగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తయిన వ్యక్తులతో పాటు ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలని సీడీసీ ఆదేశాలు జారీచేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని