Gyanvapi mosque case: ‘జ్ఞానవాపి’ కేసు..యథాతథ స్థితిని కొనసాగించండి: సుప్రీం

జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

Published : 11 Nov 2022 18:40 IST

దిల్లీ: వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే నెలలో జారీ చేసిన ఆదేశాలు రేపటితో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మే నెలలో వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ప్రార్థనా స్థలంలో ముస్లింలు నమాజ్‌ చేసుకోవడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి అనుమతినిచ్చింది. ఈ అంశానికి సంబంధించి వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. మరోవైపు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శృంగార గౌరి విగ్రహానికి పూజలు నిర్వహించే అంశంపై ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై ఈ నెల 8న విచారణ చేపట్టిన వారణాసి కోర్టు తదుపరి విచారణను నవంబరు 14కి వాయిదా వేసింది. 

ఇంతకీ ఏం జరిగింది? 

జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్‌లో కొందరు  హిందూ మహిళలు దాఖలుచేసిన పిటిషన్‌ మేరకు వారణాసి కోర్టు.. ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాలని, సీఆర్పీఎఫ్‌ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చారు. జ్ఞానవాపి అంశంలో వారణాసి కోర్టు ఆదేశాలు చట్టవిరుద్ధమని, అక్కడ జరుగుతున్న విచారణపై స్టే విధించాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాది, ప్రతివాదుల హక్కుల మధ్య సమతూకాన్ని పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేసు సున్నితత్వం దృష్ట్యా 25-30 సంవత్సరాల అనుభవమున్న సీనియర్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని