చైనా నావికా సిబ్బందిలో మానసిక సమస్యలు

చైనా నావికా సిబ్బంది మానసిక స్థితి సరిగా లేనట్టు ఇలీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది.

Published : 02 Feb 2021 01:53 IST

బీజింగ్‌: చైనా నావికా సిబ్బంది మానసిక స్థితి సరిగా లేనట్లు ఇలీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ దేశంలో తొలిసారిగా నిర్వహించిన ఓ మానసిక అధ్యయనంలో.. దక్షిణ చైనా సముద్ర జలాల్లో మోహరించిన జలాంతర్గాముల్లో పనిచేస్తున్న నావికా సిబ్బందిలో ఐదింట ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.

పరిస్థితి మరింత తీవ్రం..
దక్షిణ చైనా సముద్రంపై దృష్టి కేంద్రీకరించిన డ్రాగన్‌.. అక్కడికి రక్షణ దళాలను తరలిస్తోంది. ఆ సముద్రంలో 1.3 మిలియన్‌ చదరపు మైళ్ల మేర ప్రాంతం తమకే చెందుతుందని అంటోంది. బ్రునై, మలేషియా, ఫిలిప్పీన్స్‌‌, తైవాన్‌, వియత్నాం తదితర దేశాలకు సంబంధించిన సముద్ర జలాల్లో.. మిలిటరీ కార్యకలాపాల నిర్వహణ కోసం కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. అంతేకాకుండా అటువైపు ప్రయాణించే అమెరికా నౌకలతో కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో షాంఘైకి చెందిన నేవల్‌ మెడికల్‌ యూనివర్సిటీ.. 500 మంది నావికా సిబ్బంది, అధికారులపై తొలిసారిగా ఓ మానసిక అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా స్వీయ అంచనా చేసుకోగలిగే ప్రశ్నావళిని వారికి ఇచ్చి, సమాధానాలు రాబట్టారు. వీరిలో 21 శాతం ఎంతో కొంత స్థాయిలో మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైందని హాంకాంగ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. అంతేకాకుండా భవిష్యత్తులో వారి మానసిక సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని కూడా వెల్లడించింది.

కారణాలివేనా..

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ తన కార్యకలాపాలను తీవ్రం చేసిన నేపథ్యంలో.. సదరు నావికులు వరుసగా 60 నుంచి 90 రోజుల పాటు జలాంతర్గాముల్లోనే ఉండాల్సి రావటంతో ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ అంచనా. ఈ విధంగా వారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, పరిమిత ప్రదేశంలో, ఏకాంతంగా చాలా ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. అంతేకాకుండా, జలాంతర్గాముల్లో సంభవించే రణగొణ ధ్వనిలోనే నిద్రించాల్సి రావటం కూడా ఈ పరిస్థితికి దారితీసి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు గల నిర్దిష్ట కారణాలు తెలుసుకొనేందుకు మరిన్ని పరిశోధలు జరగాల్సి ఉందని వారు తెలిపారు.

ఇదీ చదవండి..

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని