Soumya Swaminathan: మహమ్మారి నేర్పిన పాఠమిదే..!

వాతావరణ మార్పులతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో కరోనా మహమ్మారి మనకు పాఠాలు నేర్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు.

Updated : 03 Oct 2022 10:43 IST

దిల్లీ: పర్యావరణ సమతుల్యతతోనే ప్రజలందరి జీవితాలు ముడిపడిఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. వాతావరణ మార్పులతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో కరోనా మహమ్మారి మనకు పాఠాలు నేర్పిందన్నారు. ఈ మార్పుల వల్ల బలహీన వర్గాలే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయంటూ.. పాకిస్థాన్‌ వరదల గురించి ఆమె ప్రస్తావించారు. ఏ దేశమైనా అందుకు మినహాయింపు కాదని.. అయితే అందరికి సమాన సదుపాయాలు అందించడంపైనే దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆమె టీకాల గురించి మాట్లాడారు. టీకాలు పనిచేస్తున్నాయని.. వాటి వల్ల ప్రమాదం కంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. 20, 21వ శతాబ్దంలో వాటి వల్ల ఎన్నో ప్రాణాలు పోకుండా కాపాడామన్నారు. 10 లక్షల్లో 3-4 ప్రతికూల కేసులుంటాయని చెప్పారు. టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ బారినపడే అవకాశం ఉంటుందని, అయితే వ్యాధి తీవ్రతను మాత్రం తగ్గిస్తాయని మరోసారి గుర్తుచేశారు.

‘ఈ టీకాల కారణంగా మనం త్వరగా కోలుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 13 బిలియన్ల మంది టీకా వేయించుకున్నారు. దాని వల్ల 20 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం. అమెరికాలో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నవారిలోనే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అధిక సామర్థ్యం, అత్యంత భద్రతా ప్రమాణాలతో టీకాలను రూపొందించారు. అయితే మరోపక్క వైరస్‌లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. టీకాల  సామర్థ్యాన్ని ఏమార్చేలా అవి కొసాగుతున్నాయి. కొంతమంది టీకాలు తీసుకోకపోయినా.. అనారోగ్యానికి గురికాని వారున్నారు. . కానీ అది అన్నిసార్లు సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. 

వ్యాక్సినేషన్ విషయంలో భారత్ దూసుకెళ్తోన్న తీరును ఆమె ప్రశంసించారు. కరోనా రెండో దశలో ఎక్కువభాగం వ్యాక్సినేషన్ కాలేదని, అందుకే మహమ్మారి ప్రభావం కనిపించిందన్నారు. అలాగే అంతా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని