Kendriya Vidyalayas: కేవీల్లో 14వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు.. ఈ రాష్ట్రాల్లోనే అధికం!

దేశంలోని కేవీల్లో 14వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి లోక్‌సభకు తెలిపారు.

Updated : 19 Dec 2022 21:58 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalayas) 14వేలకు పైగా బోధన, బోధనేతర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉండగా.. తమిళనాడులో 1,220, కర్ణాటకలో 1,053, పశ్చిమబెంగాల్‌లో 1,043 చొప్పున ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. సిక్కింలో కేవలం 12 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలను వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిచ్చారు. కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తంగా 14,461 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌‌‌(KVS) ఇప్పటికే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిందని.. నిబంధనల ప్రకారమే ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేశారు. విద్యార్థులకు బోధన- అభ్యాస ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు కేవీల ద్వారా తాత్కాలికంగా ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించినట్టు తెలిపారు.

ఇటీవల 13,404 బోధన, బోధనేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఉద్యోగ ఖాళీలను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని