Covid 19: మూడువారాల వ్యవధిలో.. అక్కడ 430శాతం పెరిగిన కొవిడ్‌ కేసులు

దేశరాజధానిలో ఇటీవల కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజువారి కేసుల సంఖ్య వెయ్యికి చేరింది.

Published : 18 Apr 2023 22:29 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్‌ విజృంభణ మళ్లీ కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 11వేలకు చేరింది. దీంతో క్రియాశీల కేసుల్లోనూ పెరుగుదల గణనీయంగా కనిపిస్తోంది. కేవలం దిల్లీలోనే మూడు వారాల వ్యవధిలోనే కొవిడ్‌ కేసులు 430శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. 

దిల్లీలో మార్చి 30న 932 కేసులు ఉండగా ఏప్రిల్‌ 17నాటికి క్రియాశీల కేసుల సంఖ్య 5వేలకు చేరువైనట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఈ మధ్యకాలంలో 30 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. కేవలం ఏప్రిల్‌ 15వ తేదీన ఒక్కరోజే ఐదు కొవిడ్‌ మరణాలు నమోదు కావడం కలవరపాటుకు గురిచేసింది. అంతేకాకుండా ఏప్రిల్‌ 15న ఒక్కరోజే 1000కిపైగా కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ఏప్రిల్‌ 12న కూడా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇలా రోజువారి కేసుల సంఖ్య వెయ్యి దాటడం గడిచిన ఏడు నెలల్లో ఇదే తొలిసారి.

దేశరాజధానిలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రి చేరికలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ కట్టడి చర్యలతో పాటు పౌరులు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలిపింది. కొవిడ్‌ పెరుగుతున్న దృష్ట్యా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. మరోవైపు వచ్చే రెండు వారాల్లో దిల్లీలో కొవిడ్‌ కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నిపుణులు సురేశ్‌ కుమార్‌ అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని