Afghanistan: జనరల్‌ బోగీ కాదు.. అమెరికా విమానం ఇది!

ఈ ఫొటోలో కన్పిస్తున్నది ప్యాసింజర్‌ రైల్లోని జనరల్‌ బోగీ కాదు.. అఫ్గాన్‌ పౌరులతో నిండిపోయిన అమెరికా విమానం ఇది..! తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు..

Updated : 17 Aug 2021 14:10 IST

అఫ్గాన్‌ వాసుల భయాందోళనకు నిదర్శనం ఈ ఫొటో

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఫొటోలో కన్పిస్తున్నది ప్యాసింజర్‌ రైల్లోని జనరల్‌ బోగీ కాదు.. అఫ్గాన్‌ పౌరులతో నిండిపోయిన అమెరికా విమానం ఇది..! తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు.. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఇందుకోసం ప్రాణాలను తెగించేందుకైనా వెనుకాడటం లేదు. కాబూల్‌ విమానాశ్రయం నుంచి వచ్చిన అమెరికా విమానంలో కన్పించిన ఈ దృశ్యం.. అఫ్గాన్‌ పౌరుల దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా 640 మంది విమానంలో కింద కూర్చుని ప్రయాణించారు.

తాలిబన్ల అరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయన్న భయాందోళనలతో వేలాది మంది అఫ్గాన్‌ వాసులు నిన్న దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. రద్దీ పెరగడంతో ఎయిర్‌పోర్టు గేట్లు మూసివేస్తే ప్రహరీ పైనుంచి దూకి, ఇనుప కంచెలను దాటుకొని లోపలికి ప్రవేశించారు. విమానాల్లో చోటు కోసం రన్‌వేపై పరుగులు తీశారు. లోపలికి ఎక్కేందుకు ఒకర్నొకరు తోసుకున్నారు. అలా అమెరికాకు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది అఫ్గాన్‌ వాసులు ఎక్కి కింద కూర్చున్నారు. వారి వద్ద ఎలాంటి వస్తువులు, లగేజీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో అన్నీ వదులుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు.

దీంతో ఈ విమానం రైల్లో జనరల్‌ బోగీని తలపించింది. ఈ విమానం ఫొటోలను అమెరికా అధికారిక మీడియా సంస్థ ‘డిఫెన్స్‌ వన్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విమానం ఖతార్‌లో ల్యాండ్ అయ్యిందని, అక్కడే వీరంతా దిగిపోయారని డిఫెన్స్ వన్‌ తెలిపింది. ఇదే కాదు.. అమెరికాకు చెందిన ఇతర విమానాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్పించాయి.

విమానం ఎక్కేందుకు అఫ్గాన్‌ వాసులు ఆపసోపాలు పడుతున్నారు. ఒక దశలో కొందరు విమానం రెక్కలు, టైర్ల భాగం వద్ద దాక్కొని ప్రయాణించేందుకు ప్రయత్నించగా.. టేకాఫ్‌ అయిన తర్వాత కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నిన్న సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అఫ్గాన్‌ సంక్షోభం.. చిత్రాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు