25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు

దేశవ్యాప్తంగా ఉన్న 25శాతం ఆరోగ్య సిబ్బందిలో కొవిడ్‌-19 సెరోపాజిటివిటీ (యాంటీబాడీల వృద్ధి) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు.

Published : 10 Feb 2021 01:14 IST

రాజ్యసభలో వెల్లడించిన మంత్రి

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 25శాతం ఆరోగ్య సిబ్బందిలో కొవిడ్‌-19 సెరోపాజిటివిటీ (యాంటీబాడీల వృద్ధి) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఎంతమంది ఆరోగ్యసిబ్బంది కరోనా బారిన పడ్డారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ‘‘ కరోనా దేశవ్యాప్తంగా ప్రభావం చూపడంతో విడిగా ఆరోగ్య కార్యకర్తల వివరాలు ప్రభుత్వం సేకరించలేదు. కానీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్) చేసిన మూడో విడత సెరో సర్వేలో (డిసెంబరు2020 నుంచి జనవరి 2021 మధ్యలో చేసిన సెరో సర్వే) 25.7శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు గుర్తించినట్లు వెల్లడించారు.’’ అని మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

సెరో సర్వే లేదా సెరోప్రివిలెన్స్‌ అనేవి రక్త పరీక్ష ద్వారా శరీరంలోని యాంటీబాడీలను గుర్తించే విధానం. కరోనా ప్రారంభం నుంచి ఐసీఎంఆర్‌ భారత్‌లో వివిధ దశల్లో సెరో సర్వేలు నిర్వహించింది. ఐసీఎంఆర్‌ నిర్వహించిన మూడో దశ సర్వేలో భారత్‌లో మొత్తం 21శాతం మంది ప్రజల్లో యాంటీబాడీలు గుర్తించినట్లు తెలిపింది. సాధారణ ప్రజలతో పోల్చుకుంటే ఎక్కువ శాతం వైద్యసిబ్బందిలో యాంటీబాడీలు గుర్తించామని వారు తెలిపారు.

కరోనా కాలంలో అవిశ్రాంత సేవలనందిస్తున్న 22లక్షలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద 50లక్షల ప్రమాద బీమాను కల్పించామని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఇవీ చదవండి..

ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది.. ఫాస్టాగ్‌ తీసుకున్నారా?

శశికళకు రజనీ ఫోన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని