Odisha Train Accident: 1,000 మంది సిబ్బంది.. భారీ యంత్రాలతో ట్రాక్‌ పునరుద్ధరణ..

ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన ప్రదేశంలో ట్రాక్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. రైల్వే మంత్రి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. 

Published : 04 Jun 2023 12:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ప్రదేశంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుక భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 1,000 మంది రైల్వే సిబ్బంది,  ఏడు పాకెటింగ్‌ యంత్రాలు,  భారీ రైల్వే క్రేన్‌, నాలుగు రోడ్‌క్రేన్లు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. బాలేశ్వర్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 288 మృతదేహాలను వెలికి తీయగా.. 1,100 మంది గాయపడినట్లు గుర్తించారు.

మరోవైపు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ప్రమాద స్థలిలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ  మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం నాటికి రాకపోకలను పునరుద్ధరించేస్తామని పేర్కొన్నారు. రైలు శకలాల నుంచి బాధితులను గుర్తించి వెలికి తీసే కార్యక్రమం శనివారం ముగియడంతో.. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. శనివారం రాత్రి భారీ జనరేటర్లు, లైట్లను ఉపయోగించి ట్రాక్‌ లింకింగ్‌ పనులు చేస్తున్నారు. 

‘‘దాదాపు 1,000 మంది కార్మికులు, 7 పొక్లెయిన్లు, 2 యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్లు ప్రస్తుతం ఘటనా స్థలిలో పనిచేస్తున్నాయి. 140 టన్నుల సామర్థ్యమున్న రైల్వే క్రేను, 3 రోడ్‌ క్రేన్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరో క్రేన్‌ను తరలిస్తున్నాం’’ అని ఆగ్నేయ రైల్వే సీపీఆర్‌వో వెల్లడించారు. యాక్సిడెంట్‌ జరిగిన ప్రదేశంలో భారీగా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి స్థానికులు అటువేపు రాకుండా సూచనలు చేస్తున్నారు. దీంతోపాటు రైల్వే పోలీసులు ఆ ప్రదేశంలో మోహరించారు. ప్రమాదానికి గురైన 21 బోగీలను పట్టాలపై  నుంచి తొలగించే కార్యక్రమం పూర్తి చేశారు. కొత్త ట్రాక్‌ను నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని