Padma Shri: ‘పద్మశ్రీ’ వరించినా.. పక్కా ఇల్లు మాత్రం రాలేదు..!

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన 84 ఏళ్ల కళాకారిణికి ఉండటానికి పక్కా ఇల్లు లేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆమె ఎదురుచూపులు ఇంకా ఫలించలేదు. 

Published : 27 Jan 2023 19:36 IST

లోర్హా: పొట్టకూటి కోసం కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించిన ఆమె.. కళ మీద ప్రేమతో 70 ఏళ్ల వయసులో చిత్రకారిణిగా మారారు. అరుదైన కళకు ప్రాణం పోసి ఎనిమిది పదుల వయసులో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. కళారంగంలో ఆమె చేస్తున్న సేవలకు ఇప్పుడు  ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ (Padma Shri)’ పురస్కారం కూడా వరించింది. కానీ ఉండటానికి పక్కా ఇల్లు మాత్రం లేదు. పక్కా ఇంటికి కోసం ఆమె ఎదురుచూపులు ఇంతవరకూ ఫలించలేదు. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఉమేరియా జిల్లా లోర్హా గ్రామానికి చెందిన 84 ఏళ్ల జోధయ్య బాయి (Jodhaiya Bai) ఈ ఏడాది దేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు. 10నెలల క్రితం ఆమె దిల్లీలో నారీ శక్తి అవార్డును కూడా అందుకున్నారు. అప్పుడు ప్రధాని మోదీని కలిసిన ఆమె.. పక్కా ఇల్లు లేక పడుతున్న అవస్థలను చెప్పి ఇల్లు ఇప్పించాలని అభ్యర్థించారు. మోదీ కూడా సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. అయితే ఇప్పటికీ తనకు పక్కా ఇల్లు రాలేదని ఆమె చెప్పారు.

‘‘ఇల్లు మంజూరు చేయాలని ఉమేరియాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగా. భోపాల్‌కూ వెళ్లా. కానీ పని జరగలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లబ్ధిదారుల్లో నా పేరు లేదని అధికారులు చెబుతున్నారు. నాకు వంటగ్యాస్‌ రాయితీ ఉంది. ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. కానీ పక్కా ఇల్లు మాత్రం లేదు. ఇప్పటికీ మట్టితో కట్టిన ఇంట్లోనే ఉంటున్నా. దయచేసి నాకు ఇల్లు కేటాయించాలని ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేతులెత్తి అభ్యర్థిస్తున్నా’’ అని జోధయ్య బాయి ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుపేద కుటుంబానికి చెందిన జోధయ్య బాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం నిర్మాణరంగంలో కూలీగా మారారు. కొన్ని సార్లు డబ్బుల కోసం అక్రమ మద్యం కూడా అమ్మారు. అయితే చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉన్న ఆమె.. తన 70 ఏళ్ల వయసులో పెయింటింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టారు. కాన్వాస్‌, కాగితంపై పెయింటింగ్‌ చేసిన తర్వాత.. ఇప్పుడు బంకమట్టి, లోహం, కలప వంటి వాటిపై బైగా తెగకు సంబంధించిన చిత్రాలు వేస్తూ చిత్ర కళాకారిణిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. కళారంగంలో ఆమె సాధించిన విజయాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతేడాది నారీశక్తి పురస్కారంతో సత్కరించింది. ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసి ఆమె సేవలను గౌరవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని