Pakistan: 12 ఉగ్రవాద సంస్థలకు పాక్‌ అడ్డా.. అమెరికా పరిశోధన సంస్థ వెల్లడి

లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్‌ తదితర 12 ఉగ్రసంస్థలకు పాకిస్థాన్‌ ఆవాసంగా ఉందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్ర పరిశోధన విభాగం ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌)’ వెల్లడించింది.....

Published : 29 Sep 2021 02:12 IST

వాషింగ్టన్‌: అమెరికా ద్వారా విదేశీ ఉగ్రవాద సంస్థ(ఎఫ్‌టీవో)లుగా ముద్రపడిన లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్‌ తదితర 12 ఉగ్రసంస్థలకు పాకిస్థాన్‌ ఆవాసంగా ఉందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్ర పరిశోధన విభాగం ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌)’ వెల్లడించింది. పాక్‌లో ఉగ్ర కార్యకలాపాలపై ‘టెర్రరిస్ట్‌ అండ్‌ అదర్‌ మిలిటెంట్‌ గ్రూప్స్‌ ఇన్‌ పాకిస్థాన్‌’ పేరిట ప్రత్యేక నివేదికను రూపొందించి, గత వారం నిర్వహించిన క్వాడ్ సమ్మిట్ సందర్భంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా పాక్‌ను ఉగ్ర కార్యకలాపాల స్థావరంగా గుర్తించింది. ప్రధానంగా భారత్‌, అఫ్గానిస్థాన్‌లో విధ్వంసమే లక్ష్యంగా.. ఈ 12 విదేశీ ఉగ్రవాద సంస్థలు పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కొన్ని ఉగ్రసంస్థలు 1980ల నుంచి ఉన్నట్లు తెలిపింది.

భారత్‌ లక్ష్యంగా దాడులు చేసే లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ పుట్టినిల్లు అని సీఆర్‌ఎస్‌ ప్రస్తావించింది. పరిశోధనా విభాగం విడుదల చేసిన ఈ నివేదికలో పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను ఐదు రకాలుగా వర్గీకరించింది. అవి ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసే సంస్థలు, అఫ్గాన్‌లో దాడులు చేసేవి, భారత్‌ సహా కశ్మీర్‌లో దాడులకు పాల్పడేవి, పాక్‌లోనే విధ్వంసం సృష్టించేవి, షియా వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవిగా విడదీసింది.

పాక్‌ కేంద్రంగా లష్కరే తొయిబా 1980ల కాలం నుంచే కార్యకలాపాలు సాగిస్తుండగా.. 2001లో దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. 2008లోని ముంబయి దాడులు, ఇతర కీలక ఉగ్రదాడులు ఈ సంస్థ పనేనని సీఆర్‌ఎస్‌ వెల్లడించింది. 2000లో మసూద్‌ అజర్‌ ఏర్పాటు చేసిన జైషే మొహమ్మద్‌ సంస్థ మరుసటి ఏడాదే ఉగ్రవాద సంస్థగా వెలుగులోకి వచ్చింది. భారత పార్లమెంట్‌పై దాడి సహా అనేక దాడులకు ఈ సంస్థ పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. 1980లో పురుడుపోసుకున్న హరాకత్‌ ఉల్‌ జిహాద్‌ ఇస్లామీ తొలుత తాలిబన్లకు సాయం చేస్తూ.. అఫ్గాన్‌, భారత్‌, బంగ్లాదేశ్‌ లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతోంది. కశ్మీర్‌లోనూ కల్లోలం సృష్టించేందుకు నిరంతరం దాడులకు ప్రయత్నిస్తోంది.

ఇక హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ మిలిటెంట్‌ గ్రూపుల కలయికతో పాక్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న రాజకీయ అనుబంధ ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో తరచూ దాడులకు పాల్పడుతోంది. దాయాది దేశం కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మరో సంస్థ అల్‌ఖైదా. కరాచీ, గిరిజన ప్రాంతాల్లో ప్రభావం కలిగి ఉన్న ఈ సంస్థ అఫ్గాన్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. ఇలా అనేక ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్‌ సురక్షితమైన కేంద్రంగా ఉందని కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ వెల్లడించింది. వీటితోపాటు ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌, అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు సీఆర్‌ఎస్‌ నివేదికలో ప్రస్తావించింది. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, అకా జైష్‌ అల్‌ అద్‌, సిపాహీ సహ్‌బా పాకిస్థాన్‌, లష్కరే జాంగ్వి లాంటి సంస్థలు సైతం ప్రపంచవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని