Taliban: తాలిబన్ల రెండో ఇల్లు పాకిస్థాన్‌ ... జైబుల్లా ముజాహిద్‌ ప్రకటన

‘‘పాకిస్థాన్‌ మా తాలిబన్లకు రెండో ఇల్లు వంటిది. ఆ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ గ్రూపు మా భూభాగాన్ని  వినియోగించుకోనీయం’’ అని తాలిబన్‌ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు.

Published : 26 Aug 2021 22:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘పాకిస్థాన్‌ మా తాలిబన్లకు రెండో ఇల్లు వంటిది. ఆ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ గ్రూపు మా భూభాగాన్ని  వినియోగించుకోనీయం’’ అని తాలిబన్‌ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. పాక్‌-అఫ్గాన్‌లు సరిహద్దులు పంచుకుంటాయన్నారు. మతం విషయానికి వస్తే మా రెండు దేశాలు సహజ మిత్రులని తెలిపారు. భవిష్యత్తులో పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకొనే అంశంపై మేము దృష్టిపెడతాము. 

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంలో పాక్‌ పాత్ర ఏమాత్రం లేదని జైబుల్లా పేర్కొన్నారు. ఆ దేశం మా అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో అఫ్గానిస్థాన్‌  మంచి సంబంధాలు కోరుకుంటోందన్నారు. అఫ్గాన్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే భారత్‌ తన విధానాన్ని నిర్ణయించుకొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అఫ్గాన్‌ గడ్డపై ఐసిస్‌ లేదని జైబుల్లా తేల్చి చెప్పారు. ఇక భారత్‌-పాక్‌ల మధ్య ఉన్న సమస్యలు వారు చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు. 

టీటీపీతో భయం..

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించారని పాక్‌ సంతోషించినా.. తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఎక్కడ పుంజుకొంటుందో అని భయపడుతోంది. పాకిస్థాన్‌లో ఇది అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ఈ సంస్థ అక్కడ పలు భారీ దాడులకు కారణమైంది. 2011లో కరాచీలో అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసింది. 2014లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై దాడి చేసి పిల్లలతో సహా 150 మందిని చంపేసింది. 

2007లో ఈ సంస్థను ఖైబర్‌ పక్తూన్‌క్వాలో బైతుల్లా మెహ్‌సూద్‌ స్థాపించారు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య తర్వాత వేగంగా పుంజుకొంది. మెహసూద్‌కు అఫ్గాన్‌ తాలిబన్‌, అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009నాటికి ఈ సంస్థ పుంజుకొంటున్న సమయంలో డ్రోన్‌ దాడిలో చనిపోయాడు. అతని వారసుడు హకీముల్లా మెహసూద్‌ కూడా 2013లో ఒక డ్రోన్‌ దాడిలో చనిపోయాడు. ఆ తర్వాత టీటీపీ వర్గాలుగా విడిపోయింది. దానికి ముల్లా ఫజలుల్లాను నాయకుడిగా ఎంచుకొన్నారు. అదే సమయంలో పాకిస్థాన్‌ భద్రతా దళాలు దాడులను పెంచాయి. పాక్‌కు అమెరికా నుంచి డ్రోన్ల రూపంలో సాయం కూడా అందింది. ఈ ఆపరేషన్‌కు జెర్బ్‌-ఇ-అజబ్‌ అనే పేరుపెట్టారు. దీంతో ఆ బృందం బలహీనపడింది. మధ్యశ్రేణి నాయకులు అఫ్గానిస్థాన్‌కు పారిపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని