Parliament: వర్షాకాల సమావేశాలకు పార్టీలు సన్నద్ధం!

పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Published : 18 Jul 2021 14:21 IST

అఖిలపక్షంతో కేంద్ర ప్రభుత్వం భేటీ

దిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్షం భేటీ అయ్యింది. పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అధికారపక్షం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను మంత్రి ప్రహ్లాద్‌ జోషి అఖిలపక్ష నాయకులకు వివరించారు. ఈ సమావేశాల్లో దాదాపు 31బిల్లులను ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. దాదాపు అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్షానికి తెలిపింది. ఇక అమలులో ఉన్న ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్‌ బిల్లులను కూడా మరోసారి సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

కేంద్రాన్ని నిలదీసేందుకు పార్టీలు సిద్ధం..

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా దేశంలో ద్రవ్యోల్బణం, సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొన్న తీరుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. కొవిడ్, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల ఉద్యమం, రఫేల్‌ డీల్‌, ధరల పెరుగుదలతోపాటు ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ ఇప్పటికే నిర్ణయించింది. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ సమస్యలను ప్రధానంగా లేవనెత్తనున్నాయి. ముఖ్యంగా కేంద్ర జల్‌శక్తి గెజిట్‌ నోటిఫికేషన్‌ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) లేవనెత్తనున్నట్లు సమాచారం. మరోవైపు విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ ఉక్కు వంటి కీలక అంశాలను లేవనెత్తేందుకు వైకాపా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఏపీ ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతల అంశాలను లేవనెత్తాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

వర్షకాల పార్లమెంట్ ​సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని విపక్షాలు సిద్ధమవగా.. వారి ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ మంత్రులకు ఇప్పటికే సూచించారు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ అన్ని పార్టీలు ప్రజలపక్షాన నిలవాలని.. పార్లమెంట్‌ సమావేశాల్లో పౌరులకు సంబంధించిన అన్ని సమస్యలపై ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగేలా చూడాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం (జులై 19)న ప్రారంభమై, ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఉభయ సభలు కూడా ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని