CBI-ED: సీబీఐ, ఈడీ చీఫ్‌లకు ఐదేళ్ల పదవీకాలం.. బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్ల పదవీకాలం పొడగింపునకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది.

Published : 14 Dec 2021 23:31 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్ల పదవీకాలం పొడగింపునకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సీబీఐ, ఈడీ అధిపతుల పదవీకాలాన్ని గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించేందుకు వీలుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా డిసెంబరు 3న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపగా.. నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా పెద్దల సభలోనూ బిల్లు పాస్‌ అయ్యింది. 

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి, నల్లధనంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి అంతర్జాతీయ నేరాలు భారత్‌కు సవాలుగా మారుతున్నాయని అన్నారు. దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థకు కూడా ఇవి ముప్పే అని తెలిపారు. నేరాల తీరు మారిన నేపథ్యంలో దర్యాప్తు కష్టంగా మారుతోందని, అందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. 

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లు మాత్రమే. అయితే అది పూర్తయిన తర్వాత ఏడాది చొప్పున మొత్తం ఐదేళ్ల వరకు పదవీకాలాన్ని పొడిగించేందుకు అవకాశం కల్పిస్తూ గత నెల కేంద్రం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఇప్పుడు వాటి స్థానంలో బిల్లు తీసుకురాగా.. పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. అయితే ఐదేళ్ల తర్వాత పదవీకాలాన్ని పొడిగించడానికి అవకాశం ఉండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని