Heavy Rains: ముంచెత్తిన అకాల వర్షం.. 13 మంది మృతి!

రాజస్థాన్‌ (Rajasthan) వివిధ ప్రాంతాలను అకాల వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Published : 27 May 2023 22:43 IST

ఫతేపుర్‌: రాజస్థాన్‌లోని (Rajasthan) కొన్ని ప్రాంతాలను అకాల వర్షాలు (Rains) ముంచెత్తాయి. ఈదురుగాలులు, వడగళ్లతో బీభత్సం సృష్టించాయి. ఫతేపుర్‌ (Fatehpur), షెకావతి ప్రాంతాల్లోని ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు, పలు జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు కూలిపోగా.. మరికొన్ని దెబ్బతిన్నాయి. వర్షం ప్రభావంగా 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలపై అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు. సరైన సమయంలో తమను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని విమర్శిస్తున్నారు. 

అకాల వర్షాల కారణంగా వచ్చిన వదల్లో ఓ పెళ్లి మండపం కొట్టుకుపోయింది. భారీ వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సేవలను పునరుద్ధరించడం అక్కడి అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సేవలు నిలిచిపోయాయి. భారీ వర్ష సూచన ఉన్నట్లు జైపూర్‌లోని వాతావరణ కేంద్రం గత సోమవారం నుంచి హెచ్చరిస్తూనే ఉంది. సుమారు గంటకు 70కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది. అయినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో 13 మంది మృతి చెందినట్లు విపత్తునిర్వహణ ప్రతిస్పందన అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు