Pedestrians: పాదచారులు ‘హైవే’లపై తిరగకూడదు..!: సుప్రీం కోర్టు

పాదచారులు హైవేలపై తిరగకూడదని సుప్రీం కోర్టు సూచించింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను కొట్టేసింది.

Published : 21 Nov 2023 06:48 IST

దిల్లీ: వాహనాల రాకపోకలకు ఉద్దేశించిన హైవేల (Highways)పై పాదచారులు తిరగకూడదని సుప్రీం కోర్టు (Supreme Court) హితవు పలికింది. ఈ మేరకు క్షమశిక్షణ అవసరమని పేర్కొంది. హైవేలపై పాదచారుల భద్రత (Pedestrians Safety) అంశాన్ని లేవనెత్తుతూ దాఖలైన ఓ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరిస్తూ.. సుప్రీం కోర్టు ఈ మేరకు సూచనలు చేసింది. ఇదే అంశంపై పిటిషనర్లు తొలుత గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖను సంప్రదించాలని సూచించింది. దీంతో గుజరాత్‌ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఎఫ్‌ఐఆర్‌ ఇతర రాష్ట్రంలో నమోదైనా.. ముందస్తు బెయిల్‌!

ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పరిశీలించింది. ‘అసలు హైవేపైకి పాదచారులు ఎలా వస్తారు? వారికి క్రమశిక్షణ ఉండాలి. వారు హైవేలపై తిరగకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఇలా తిరిగే వ్యక్తులు కనిపించరు. భవిష్యత్తులో పాదచారుల కోసం హైవేలపై వాహనాలను ఆపాలని కూడా కోరతారు. అదెలా సాధ్యం?’ అని పిటిషన్‌దారులను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిని కోర్టు ఎలా సమర్థించగలదు? అని తెలిపింది.

హైవేలపై పాదచారులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది వాదించగా.. పాదచారులు ఉండకూడని చోట ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘దేశంలో హైవేలు పెరిగాయి. కానీ, మనలో క్రమశిక్షణ పెరగలేదు’ అని వ్యాఖ్యానించింది. ‘ఇది పూర్తిగా అసంబద్ధ పిటిషన్. వాస్తవానికి దీనికి జరిమానా విధించాల్సింది. ఏదేమైనా.. సంబంధిత మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు హైకోర్టు మీకో అవకాశం ఇచ్చింది’ అని పిటిషన్‌దారులను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని