Cough Syrup: ఉజ్బెకిస్థాన్‌ ఘటన.. నోయిడాలో ఆ సిరప్‌ తయారీ నిలిపివేత

ఉజ్బెకిస్థాన్‌ దగ్గుమందు తాగి పిల్లు మరణించిన ఘటనపై భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తయారీని నిలిపివేసి, దర్యాప్తు ప్రారంభించింది. 

Published : 29 Dec 2022 13:28 IST

దిల్లీ: భారత్‌లో తయారైన సిరప్‌పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మరియన్‌ బయోటెక్‌ కంపెనీ ఈ మందు తయారు చేసింది. కాగా, ఆరోపణలపై భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. నమూనాలు పరీక్షించే వరకు నోయిడా యూనిట్‌లో తయారీని నిలిపివేసింది. సెంట్రల్ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ (CDSCO), ఉత్తర్‌ప్రదేశ్‌ డ్రగ్స్‌ కంట్రోలింగ్ అండ్‌ లైసెన్సింగ్ అథారిటీ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఔషధ సంస్థ స్పందించింది. తయారీ యూనిట్‌ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపించామని, ఫలితాలు రానున్నాయని వెల్లడించింది. దీనిపై ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి నివేదికను కోరినట్లు పేర్కొంది. 

మరియన్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన ‘డాక్‌-1 మాక్స్‌’ సిరప్‌ తాగిన  పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది.  కాగా, వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో ఈ దగ్గు మందును తాగడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ 2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టరు చేయించుకుంది. 

ఈ ఏడాదిలో ఇటువంటి తరహాలో రెండో ఘటన ఇది. భారత్‌లో తయారైన దగ్గుమందు కారణంగా గాంబియా దేశంలో విషాదం చోటుచేసుకుంది. దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా... మైడెన్‌ ఫార్మా కంపెనీ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని