జవాన్‌ను చైనాకు అప్పగించిన భారత్‌

వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా జవానును భారత సైన్యం సోమవారం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. గత శుక్రవారం  తెల్లవారుజామున పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ

Published : 11 Jan 2021 14:00 IST

లద్దాఖ్‌: వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా జవానును భారత సైన్యం సోమవారం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. గత శుక్రవారం  తెల్లవారుజామున పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ వైపు పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం దర్యాప్తు జరపగా.. అతడు ఉద్దేశపూర్వకంగా భారత భూభాగంలోకి రాలేదని అధికారులు ధ్రువీకరించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీంతో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తూర్పు లద్ధాఖ్‌లోని చుషుల్‌-మోల్డో సరిహద్దుల వద్ద ఆ జవానును చైనా బలగాలకు అప్పగించినట్లు పేర్కొన్నాయి. 

కాగా.. చైనా జవాను భారత భూభాగంలోకి రావడం గత నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది అక్టోబరులో తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌ సెక్టార్‌లో పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల దర్యాప్తు అనంతరం ఆ జవాను తిరిగి చైనాకు అప్పగించారు. లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంతో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్ల ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఉద్రిక్తతలపై ఇరుదేశాలు ఇప్పటికే పలుమార్లు సైనికపరమైన చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లభించలేదు. గల్వాన్‌ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చైనావైపు కూడా పలువురు మరణించారు. 

ఇవీ చదవండి..

ఆ ద్వీపాలు విమానాలకు శాపమా!

భారత్‌ కరోనా టీకాలు మంచివే: చైనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని