Planet Parade: 1000 ఏళ్ల తర్వాత.. ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు

అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 1000 ఏళ్ల తర్వాత ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి.......

Published : 28 Apr 2022 01:40 IST

‘ప్లానెట్​ పరేడ్’గా పేర్కొన్న సువేందు పట్నాయక్​

దిల్లీ: అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 1000 ఏళ్ల తర్వాత ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతితో పాటు శని గ్రహాం ఒకే రేఖపై కనువిందు చేశాయి. తూర్పున సూర్యోదయానికి ముందు ఈ గ్రహాలు ఒకే రేఖపైన దర్శనమిచ్చినట్లు భువనేశ్వర్​లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్​ సువేందు పట్నాయక్​ వెల్లడించారు. సౌర వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఒకే వరుసలోకి గ్రహాలు వచ్చే క్రమాన్ని ‘ప్లానెట్​ పరేడ్​’ అని పేర్కొంటారని పట్నాయక్‌ తెలిపారు. ‘2022 ఏప్రిల్​ 26, 27 తేదీల్లో ఈ అరుదైన గ్రహాల కూర్పు కనిపించింది. దీనిని ప్లానెట్​ పరేడ్​గా చెబుతారు. దీనికి శాస్త్రీయంగా ఎలాంటి నిర్వచనం లేదు’ అని వివరించారు.

పట్నాయక్‌ వివరాల ప్రకారం.. ‘అంతరిక్షంలో సాధారణంగా మూడు ప్లానెట్​ పరేడ్​లు కనిపిస్తాయి.  అందులో మొదటిది.. సూర్యుడికి ఒకవైపునకు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. మూడు గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకు కనిపించటం సర్వసాధారణం. ఒక ఏడాదిలో ఇలా చాలా సార్లు దర్శనమిస్తాయి. ఏడాదిలో ఒకసారి నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఐదు గ్రహాలు ఇలా ఒక వరుసలోకి వస్తాయి. 8 గ్రహాలు సైతం ఇలా ఒకే వరుసలోకి వస్తాయని.. కానీ అందుకు 170 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు.

‘ఇక రెండో విషయం.. గ్రహాలు అవి కనిపించే పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే టైమ్​లో ఆకాశంలో ఒక చిన్న ప్రాంతంలో కనిపిస్తాయి. దానిని సైతం ప్లానెట్​ పరేడ్​గానే పిలుస్తారు. ఇదివరకు 2002, ఏప్రిల్​ 18న, 2020, జులైలో ఇలాంటి ప్లానెట్​ పరేడ్​ కనిపించింది. మూడోది.. కొన్ని గ్రహాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న అరుదైన సందర్భాల్లో ఈ మూడో రకం ప్లానెట్​ పరేడ్​ ఏర్పడుతుంది. మూడు గ్రహాలు ఒకే వరుసలోకి రావటం ఒక ఏడాదిలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది’ అని పట్నాయక్‌ వివరించారు.

2022 ఏప్రిల్​ 26, 27 తేదీల్లో సూర్యోదయానికి ఒక గంట ముందు, చంద్రుడితో పాటు నాలుగు గ్రహాలు తూర్పు అక్షాంక్షానికి 30 డిగ్రీల కోణంలో ఒకే వరుసలో కనిపించాయి. ఇది పైన చెప్పిన విధంగా మూడో రకం ప్లానెట్​ పరేడ్​. గతంలో సుమారు 1000 ఏళ్ల క్రితం క్రీ.శ 947లో ఇలా జరిగింది. పరిస్థితులు అనుకూలించి శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే.. టెలిస్కోప్ అవసరం​ లేకుండానే నేరుగా వాటిని చూడవచ్చు. ఏప్రిల్​ 30న శుక్రుడు, బృహస్పతి అత్యంత దగ్గరగా రానున్నాయి. బృహస్పతికి దక్షిణం వైపు 0.2 డిగ్రీల కోణంలో శుక్రుడు కనిపించనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని