Modi: దక్షిణాదిన ‘వందేభారత్‌’ పరుగులు.. జెండా ఊపిన మోదీ

దక్షిణాదిన తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు ప్రారంభించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య నడిచే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.

Updated : 11 Nov 2022 12:46 IST

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం బెంగళూరు చేరుకున్నారు. ఈ ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానికి కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైలును ప్రారంభించారు.

కేఎస్సార్‌ రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్‌ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు బెంగళూరు మీదుగా మైసూరు, చెన్నైని కలుపుతూ ఈ రైలు నడుస్తుంది. దేశంలోనే ఇది ఐదో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు. దీంతో పాటు భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. ఇది యాత్రికుల కోసం తీసుకొచ్చిన రైలు. ఎనిమిది రోజుల టూర్‌ ప్యాకేజీ ఉండే ఈ రైలులో వెళ్లి వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ వంటి పవిత్ర స్థలాలను దర్శించుకోవచ్చు.

అంతకుముందు మోదీ.. ప్రముఖ కవి కనకదాస జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత మహర్షి వాల్మికి విగ్రహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.5వేల కోట్లతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రారంభించనున్నారు. 108 అడుగుల ఎత్తయిన నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం తర్వాత తమిళనాడులోని దిండిగల్‌కు వెళ్లి అక్కడ గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ 36వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని