Modi: విదేశీ వస్తువులకు బానిస కావొద్దు: మోదీ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో ఇంకా విదేశీ వస్తువులను ఉపయోగించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు.

Published : 06 May 2022 13:25 IST

పుణె: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో ఇంకా విదేశీ వస్తువులను ఉపయోగించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఇకనైనా వాటికి బానిసవ్వడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. పుణెలోని జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన వ్యాపార సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదాన్ని నొక్కి చెప్పారు.

‘‘విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటం మనం తగ్గించుకోవాలి. ఎగుమతులకు కొత్త గమ్యాలను గుర్తించాలి. దీనిపై స్థానిక మార్కెట్లలో అవగాహన కల్పించాలి. ఈ రోజు దేశంలో ప్రతిభ,వాణిజ్యం,సాంకేతికతకు సాధ్యమైనంత ప్రోత్సాహం లభిస్తోంది. నిత్యం డజన్ల కొద్దీ స్టార్టప్‌లు నమోదవుతున్నాయి. వారానికో సంస్థ యూనికార్న్‌గా మారుతోంది. ఆత్మనిర్భరతే మన భవిష్యత్తుకు మార్గం, పరిష్కారం. ప్రభుత్వ సామర్థ్యానికి ప్రజల సహకారం తోడైతే మార్పు అనేది అనివార్యం’’ మోదీ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు యావత్‌ ప్రపంచం భారత్‌వైపు ఆశతో, నమ్మకంతో చూస్తోందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లకు పరిష్కారాల కోసం భారత్‌ చేపడుతోన్న కార్యక్రమాలను అన్ని దేశాలు ఆమోదిస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని