New Parliament Building: కొత్త పార్లమెంటు భవనం జాతికి అంకితం

New Parliament Building: నూతన పార్లమెంట్‌ భవంతి ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. స్పీకర్‌ ఓం బిర్లా సమక్షంలో మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు.

Updated : 28 May 2023 10:52 IST

దిల్లీ: అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతి (New Parliament Building)ని ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

ప్రత్యేక పూజలతో ప్రారంభం..

అక్కడి నుంచి నేరుగా నూతన భవనం (New Parliament Building) ఆవరణలో ఏర్పాటు చేసిన పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడే చేసిన హోమంలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంటు నూతన భవంతి ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. అనంతరం వేదపండితులు శాలువా కప్పి ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు.

ఇదీ చదవండి: అధునాతనం.. స్ఫూర్తిదాయకం

రాజదండానికి సాష్టాంగం..

ఈలోగా పక్కనే ఉత్సవ రాజదండానికి (Sengol) తమిళనాడు నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నుంచి నేరుగా సెంగోల్‌ దగ్గరకు చేరుకున్న ప్రధాని మఠాధిపతులకు నమస్కరించారు. అనంతరం సెంగోల్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత మఠాధిపతులు సెంగోల్‌ను ప్రధాని మోదీ చేతికి అందజేశారు. అనంతరం మఠాధిపతులు వెంటరాగా నాదస్వరం, భజంత్రీల మధ్య ప్రధాని దాన్ని లోక్‌సభలోకి తీసుకెళ్లారు. అక్కడ స్పీకర్‌ ఓం బిర్లా సమక్షంలో దాన్ని స్పీకర్‌ ఆసనం పక్కన ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి: అత్యాధునిక ఆత్మనిర్భర పతాక

జాతికి అంకితం..

లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) జాతికి అంకితం చేశారు. అనంతరం పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న పలువురు కార్మికులను శాలువాతో సత్కరించారు. జ్ఞాపికలను బహూకరించారు. తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, అశ్వనీ వైష్ణవ్‌, జైశంకర్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు