Pariksha Pe Charcha: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’

పరీక్షల ముందు చిన్నారుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రతి ఏడాది నిర్వహిస్తోన్న పరీక్షా పే చర్చ(ParikshaPeCharcha2023) కార్యక్రమం తాజాగా ప్రారంభమైంది. ఇందులో ప్రధాని మోదీ చిన్నారులతో ముచ్చటించారు.

Updated : 27 Jan 2023 15:34 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పరీక్షా పే చర్చ(ParikshaPeCharcha2023) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యకమ్రంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఇందుకు దిల్లీలోని తాల్కటోరా ఇండోర్‌ స్టేడియం వేదికైంది. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి మాట్లాడారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంపై ఇంతకుముందు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ఈ రోజు ఇలా చిన్నారుల మధ్య ఉండటం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు.

అమ్మను చూడండి..

‘సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలపై భారీ అంచనాలు పెట్టుకుంటే అది పెద్ద సమస్య. మేం రాజకీయాల్లో ఉన్నాం. విజయం కోసం మాపై కూడా భారీస్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఒక క్రికెటర్‌ మైదానంలోకి వెళ్లిన తర్వాత గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులపై కాకుండా బంతిపైనే దృష్టిపెడతాడు. మనం మన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ లక్ష్యం సాధించే దిశగానే దృష్టిపెట్టాలి. ఇక్కడ మీకు మన అమ్మల గురించి చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ అమ్మ సమయపాలనను గమనించారా..? రోజూ తాను ఇంట్లో చేసేపనిని భారంగా భావించదు. మీ అమ్మను గమనిస్తే.. సమయాన్ని ఎలా సమర్థవంతంగా వాడుకోవాలో మీకు అర్థమవుతుంది’అని ఇంటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు మోదీ.  

జీవితంలో షార్ట్‌కట్స్‌ వెతుక్కోకూడదు..

‘కొందరు విద్యార్థులు తమ సృజనను పరీక్షల్లో చీటింగ్‌ చేయడం కోసం వాడుతుంటారు. అదే సమయాన్ని, సృజనను మంచి మార్గంలో పెట్టే దిశగా వాడితే.. వారు తప్పక గొప్ప విజయాలు సాధిస్తారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్‌కట్స్‌ వెతుక్కోకూడదు. కొంతమంది విద్యార్థులు పరీక్షల సమయంలో ఎంతో శ్రమిస్తారు. ఆ శ్రమ ఎప్పటికీ వృథా కాదని నేను హామీ ఇస్తున్నాను’అని ప్రధాని వారితో అన్నారు. 

ప్రధానిజీ.. హార్డ్‌ వర్క్‌ లేక స్మార్ట్‌ వర్క్‌..?

‘స్మార్ట్‌ వర్క్‌ లేక హార్డ్ వర్క్‌’ఏదీ ముఖ్యమైంది సర్ అంటూ ప్రధానిని ఓ విద్యార్థి ప్రశ్నించారు. ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’అని ఆయన చమత్కరించారు.  ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని,  దానికి తగ్గట్టే పనిచేసి, అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. మీరు విపక్షాల నుంచి వస్తోన్న ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారని మరో విద్యార్థి ప్రశ్నించగా.. దానిపై సమాధానమిచ్చేందుకు ఇది సరైన వేదిక కాదన్నారు. అయితే విమర్శ అనేది ఆవశ్యకమన్నారు.

ఆయా రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని