
Modi-Putin Meet: భారత్- రష్యా బంధం సుస్థిరం: మోదీ
దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడకు రావడం భారత్తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్-రష్యాల మధ్య సంబంధాల్లో ఎటువంటి మార్పూ రాలేదని ఉద్ఘాటించారు. సంక్షోభ సమయంలో వ్యాక్సిన్తో పాటు మానవతా సహాయంలో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సందర్భంగా భారత ప్రధాని ఈ విధంగా మాట్లాడారు.
గడిచిన మూడు దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఆ ఘనత మీకే చెందుతుందని పుతిన్తో మోదీ పేర్కొన్నారు. ఆర్థికరంగంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఇరుదేశాలు సహకారాన్ని గుర్తుచేసిన మోదీ.. ఈ భాగస్వామ్య లక్ష్యాలను సాధించడంలో భాగంగా వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు, మారుతున్న ప్రపంచ రాజకీయాలను ప్రస్తావించిన భారత ప్రధాని మోదీ.. ఇలాంటి ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయని అన్నారు.
భారత్, రష్యాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనడంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన ఆయనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ హౌస్కు చేరుకున్న ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు అఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు.
భారత్ నమ్మకమైన మిత్రదేశం..
‘ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్న వేళ గతేడాది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17 శాతం తగ్గింది. అయినప్పటికీ ఈ ఏడాది తొలి తొమ్మిది మాసాల్లోనే అది 30 శాతం పెరిగింది. ఇంధనం, అంతరిక్ష రంగంలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి. వీటితో పాటు మిలిటరీ, సాంకేతిక రంగాల్లోనూ పూర్తి సహకారంతో కలిసి ముందుకెళ్తున్నాం’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇవే కాకుండా అంతర్జాతీయ విషయాలపైనా ఇరుదేశాల సహకారం కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు నిధులు, డ్రగ్స్ సరఫరా వంటి ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయని పుతిన్ గుర్తుచేశారు. అందుకే అఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులపైనా సర్వసాధారణంగానే రెండు దేశాలు ఆందోళన చెందుతున్నట్లు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇక సైనిక రంగంలో సహకారంపై మాట్లాడిన పుతిన్.. ఇప్పటికే భారత్, రష్యా భూభాగాల్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.