Heeraben Modi: ఆసుపత్రిలో హీరాబెన్‌.. తల్లిని పరామర్శించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Updated : 28 Dec 2022 16:32 IST

అహ్మదాబాద్‌:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) మాతృమూర్తి హీరాబెన్‌ (Heeraben) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ హుటాహుటిన అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, పలువురు భాజపా నేతలు కూడా ఆసుపత్రికి చేరుకుని మోదీ తల్లిని పరామర్శించారు.

ఈ ఏడాది జూన్‌లో హీరాబెన్‌ శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌కు ముందు మోదీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ కుటుంబం మంగళవారం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రహ్లాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

మోదీజీ.. మీకు అండగా ఉంటాం: రాహుల్‌

హీరాబెన్‌ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ‘‘తల్లీ కొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిది. మోదీజీ.. ఈ సమయంలో నా ప్రేమ, మద్దతు మీకు ఉంటుంది. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని రాహుల్‌ రాసుకొచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కూడా స్పందిస్తూ.. హీరాబెన్‌ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని