PM Modi: దేశంలో ఎంతో మందికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ స్ఫూర్తి: ప్రధాని మోదీ

పార్లమెంట్‌ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter Session) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈనెల 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. 

Updated : 07 Dec 2022 11:36 IST

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter Session) బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) మాట్లాడారు.  అమృతకాల ప్రారంభ సమయమిదన్నారు. జీ-20 సదస్సుకు సన్నద్ధం కావాలని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌కు దేశంతో పాటు సభ తరఫున ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్‌ సమర్థంగా నిర్వర్తించారని.. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషించదగ్గ విషయమన్నారు.

అనంతరం ఇటీవల కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణకు రాజ్యసభలో నివాళులర్పించారు. అటు లోక్‌సభలోనూ వీరికి నివాళులర్పించిన అనంతరం దిగువసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

ఈ సమావేశాలు ఈనెల 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. ఈ సమావేశాల్లో 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. కీలకమైన మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టనుంది. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళల రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం కల్పించాలని పలు పార్టీలు డిమాండ్‌ చేసే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని