Modi: మోదీ బిజీ బిజీ.. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ప్రధాని మోదీ ఆదివారం మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దాదాపు 6,800కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు పీఎంవో వెల్లడించింది.

Published : 18 Dec 2022 01:33 IST

దిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మేఘాలయ (Meghalaya), త్రిపుర (Tripura) రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (PMO) ప్రకటన విడుదల చేసింది. షిల్లాంగ్‌(Shillong) లోని నార్త్‌ ఈస్ట్రన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీ) స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎన్‌ఈసీ 1972, నవంబరు 7న ప్రారంభమైంది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఈశాన్య ప్రాంతాల్లో సాంఘిక, ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోంది. రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల్లో పౌరులు అభివృద్ధి చెందేలా కృషి చేస్తోంది. స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దాదాపు రూ. 2,450 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో టెలికం సేవలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 4జీ నెట్‌వర్క్‌ మొబైల్‌ టవర్లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. షిల్లాంగ్‌లోని ఉమ్‌సాలిలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్స్‌ (ఐఐఎం)ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

అక్కడి నుంచి త్రిపుర చేరుకోనున్న మోదీ దాదాపు రూ.4,350 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రూ.3,400 కోట్ల వ్యయంతో నిర్మించిన గృహాల ప్రారంభోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దాదాపు 2 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ గృహ నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రాల మధ్య అనుసంధానత మరింత అభివృద్ధి చెందేలా అగర్తల బైపాస్‌ (ఎన్‌హెచ్‌-08) రోడ్డు విస్తరణ చేపట్టారు. దీనిని ప్రధాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి గ్రామ్‌సడక్‌ యోజన కింద 230 కిలోమీటర్ల పొడవైన 32 రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత ఆనంద్‌నగర్‌లోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హొటల్‌ మేనేజ్‌మెంట్‌, అగర్తలలోని గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజీలను ప్రధాని ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని