PM Modi: కరోనా కలవరం.. ప్రధాని మోదీ కీలక భేటీ ప్రారంభం

దేశంలో బీఎఫ్‌ 7 వేరియంట్‌ కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులు, ఉన్నతాధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

Updated : 22 Dec 2022 16:52 IST

దిల్లీ: చైనా (China) సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా (Corona Virus) మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులు నాలుగు నమోదవ్వడంతో ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. తాజాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఆరోగ్యరంగ నిపుణులు ఈ వర్చువల్‌ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా మాస్కులు,భౌతిక దూరం పాటించడం, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలతో నోట్‌ను జారీచేసే అవకాశం ఉంది.  

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ టెస్టింగ్‌ను ప్రారంభించింది. మరో వారం రోజుల్లో క్వారంటైన్‌, టెస్టింగ్‌ల కోసం మౌలికసదుపాయాలు మరోసారి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశంలో ఇప్పటికే ప్రవేశించిన ఒమిక్రాన్‌ ఉపరకమైన బీఎఫ్‌.7(BF.7) కేసులు జులై, సెప్టెంబర్‌, నవంబర్‌ మాసాల్లో గుజరాత్‌, ఒడిశాలలో రెండేసి చొప్పున మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఈ వైరస్‌ సోకిన ఇద్దరు రోగులు హోం ఐసోలేషన్‌లోనే పూర్తిగా కోలుకున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశంలో 10 కరోనా వేరియంట్లు ఉండగా.. ప్రస్తుతం నమోదవుతున్న ఈ బీఎఫ్‌ 7 వేరియంట్ కొత్తది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని