New Parliament building: ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారు: రాహుల్‌ గాంధీ

New Parliament building: నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే.

Updated : 28 May 2023 14:34 IST

దిల్లీ: నూతన పార్లమెంట్‌ భవన (new Parliament building) ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. పార్లమెంట్‌.. ప్రజల గళమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రారంభోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే.

మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనానికి (new Parliament building) పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టారని విమర్శించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయా రాజ్యాంగబద్ధ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, చరిత్రాత్మక కార్యక్రమాల్లో మాత్రం వారికి భాగస్వామ్యం కల్పించడం లేదని విమర్శించారు.

అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఆదివారం ప్రారంభించారు. హోమం, రాజదండం ప్రతిష్ఠాపన, సర్వమత ప్రార్థనల మధ్య ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని