కరోనా తర్వాత తొలిసారి ‘బంగ్లా’ వెళ్తున్నా:మోదీ

బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నెల 26, 27తేదీల్లో .....

Updated : 25 Mar 2021 20:31 IST

దిల్లీ: కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడ పర్యటించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లడం, అందులోనూ స్నేహపూర్వక పొరుగు దేశమైన బంగ్లాకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తుచేసుకున్నారు. 

శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. గత శతాబ్దంలో ఆయన ఓ మహోన్నత నేతగా కొనియాడారు. ముజిబుర్‌ ఆలోచనలు, జీవితం కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్‌ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తానని తెలిపారు.

దూరదృష్టి కలిగిన హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక, అభివృద్ధి పురోగమనాన్ని ప్రశంసించడమే కాకుండా,  ఆ దేశ విజయాలకు భారత్‌ మద్దతు ఉంటుందని చెప్పందుకు ఈ పర్యటన  ఓ సూచికగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై బంగ్లాదేశ్ చేస్తున్న పోరాటానికి మద్దతును తెలియజేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని